Thursday, 15 August 2019

సోఫిస్టులు


గ్రీక్ తత్వవేత్తల లో సోఫిస్ట్ లు అనే ఒక శాఖ ఉంది. పురాతన గ్రీస్ ఒక స్వచ్ఛమైన ప్రజాతంత్ర రాజ్యం. కాకపోతే స్త్రీలకు బానిసలకు ఓటు హక్కు ఉండేది కాదు.  వారు చివరికి తమ న్యాయాధికారులను కూడా పౌరుల నుండి ఎన్నుకునేవారు. అందుచేత వారి న్యాయాధికారులు ఎవరికీ న్యాయ సూత్రాలు మీద ప్రత్యేక శిక్షణ ఉండేది కాదు. పైగా వారిని న్యాయస్థానం లో రక్షించడానికి న్యాయవాదులు ఎవరు ఉండేవారు కారు. అంటే ఎవరి వాజ్యం వారే వాదించుకోవాలి. అప్పుడు వాక్చాతుర్యం ఎవరికి ఉంటే వారికే న్యాయం జరిగేది. అంతే కానీ న్యాయం వైపు ఉన్నవారికి కాదు.

అప్పటివరకు గ్రీస్ లో తత్వశాస్త్రం ఉపయోగించి జీవించడం అనేది మహా చెడ్డది గా భావించేవారు. అంతే తత్త్వం కేవలం తత్త్వం కోసమే కానీ జీవించడానికి కాదు అని వాళ్ళ ఉద్దేశం. కానీ న్యాయస్థానాల నుండి న్యాయం పొందడానికి వారికి వాక్చాతుర్యం కావలసి వచ్చింది. దాని కోసం గ్రీస్ లో సోఫిస్ట్ లు అనే తత్వ శాఖ ప్రారంభం అయ్యింది.   తత్వశాఖ  ఉద్దేశం వాదనతో ఎలా ఆయన సరే న్యాయస్థానంలో వాజ్యం గెలిచేయడం. వీరు సామాన్య పౌరులకు తత్త్వం వాద పటిమ నేర్పేవారు. దానికి వారు నగదు పురస్కారంగా పుచ్చుకునేవారు

వాదన సోఫిస్ట్ వృత్తి. వాదన నెగ్గడమే వారి పరమావధి. ఎందుకంటే మరి న్యాయస్థానం లో వాజ్యం నెగ్గాలి కదా. వారు తమ వాదనతో తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి సునాయాసంగా చేసి పారేసేవారు. అడ్డగోలుగా వాదన చేసేవారు. కానీ వారిలో కొంతమంది గొప్ప మేధావులు ఉన్నారు.

సోఫిజం అంటే అర్ధం జ్ఞాన పిపాస కానీ కొందరు సోఫిస్ట్ లు తీసుకున్న విపరీత వైఖరి వల్ల సోఫిస్ట్రీ అంటే వాదన ద్వారా ఏదైనా సరే రుజువు చేయగలిగే కుహనా తర్కం అని అర్ధం వచ్చింది.

సోఫిస్ట్ లో ముఖ్యులు ప్రొటగొరస్ మరియు గోర్జియాస్.

PROTAGORAS: ప్రొటగొరస్ Thrace  లోని Abdera  నగరంలో క్రిస్తు పూర్వం 481  సంవత్సరంలో జన్మించాడు. అయన డెమోక్రిటస్ కు సమకాలీనుడు. ప్రొటగొరస్ ఒక నిరుపేద  కుటుంబలో జన్మించాడు. అయన కొన్ని రోజులు ఒక కూలీ గా కూడా పని చేసాడు. కానీ అయన చదువు ప్రాధాన్యత గుర్తించి చదవటం రాయటం నేర్చుకుని ఒక గొప్ప తత్వవేత్త అయ్యాడు. అయన మొత్తం గ్రీస్ అంతా పర్యటించాడు. గ్రీస్ ఆయనకు బ్రహ్మ రధం పట్టింది. చివరికి అయన ఏథెన్స్ లో స్థిరపడ్డాడు. ఆయన శిష్యులను స్వీకరించి అపార ధనవంతుడు అయ్యాడు.

ప్రొటగొరస్ ప్రకారం దేముళ్ళు ఉన్నారో లేరో మనకు తెలియదు. ఉంటె వారు ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు ఎందుకంటే దాని గురించి సరి అయిన జ్ఞానం కలగడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి.

ప్రొటగొరస్ ముందు గ్రీక్ తత్వవేత్తలు అందరు విశ్వ రహస్యాల గురించి ఆలోచించారు కానీ మానవుడిని గురించి అతని మేధస్సును గురించి విస్మరించారు.  ప్రొటగొరస్ ప్రకారం మనిషే అన్నిటికి కొలమానం. (Man  is  the  measure  of  all  things ". ఇలా ఆలోచించిన మొదటి తత్వవేత్త అయన. అందుచేత వ్యక్తివాదానికి (Individualism) అయన మూల పురుషుడు అని చెప్పుకోవచ్చు.   

ప్రొటగొరస్ కు అతనికి ముందు గ్రీక్ తత్వవేత్తలు ఒక ముఖ్య తేడా ఉంది. అతనికి ముందు గ్రీక్ తత్వవేత్తలు తత్త్వం వలన డబ్బు సంపాదించడం తప్పు అనుకునేవారు. ప్రొటగొరస్ కు తత్త్వం వలన డబ్బు సంపాదించడం తప్పు కాదు.

ప్రొటగొరస్ ప్రకారం సత్యం అయినా సర్వత్రా మరియు సర్వ కాలాలలో లో ఆమోదయోగ్యం మరియు స్వీకారం కాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక ఘటన యదార్థం అని నమ్మితే అది అతనికే యదార్థం. అది ఇంకొక వ్యక్తికి యదార్థం కాకపోవచ్చు. ప్రపంచంలోని ఒక యదార్థం కంటే ఇంకొక యదార్థం ఎక్కువ సరి ఐనది అని చెప్పడానికి ఏమీ కొలమానం లేదు.

అంతే కాదు యదార్థం కూడా కాలం తో పాటు మారుతుంది. ఒక వ్యక్తి నిన్నటివరకు యదార్థం అని నమ్మేది అతనికి రోజు యదార్థం కాకపోవచ్చు. అంటే యదార్థం అనేది వ్యక్తి ని బట్టే కాకుండా సమయాన్ని బట్టి కూడా మారుతుంది.

రెండు వాదనలలో వాదన సరి ఐనది అనేది మనము చెప్పలేము కానీ ఎక్కువ మంది వాదన ను ఆమోదిస్తారో అది సరి కాకపోయినా సరే మంచిది అని మనం భావించవచ్చు. 

GORGIAS: గోర్జియాస్ సిసిలీ లోని Leontini  నగరం లో క్రిస్తు పూర్వం 483  లో జన్మించాడు.అయన ఒక గొప్ప వక్త అయన మాట్లాడుతుంటే జనం మంత్రముగ్ధులు అయిపోయేవారు. అయన కూడా చివరికి ఏథెన్స్ నగరంలోనే స్థిరపడ్డాడు.

ఈయన కూడా అంతిమ నిజాలు అనేవి ఉండవు అని చెప్పాడు. జ్ఞానం అనేది మన ఇంద్రియాల వలన కలిగినది కాబట్టి అది అంతిమం కాదు. అలాగే బుద్ధి ద్వారా వచ్చే జ్ఞానం కూడా అంతిమం కాదు. అందుచేత అయన నిజం అనేది లేదు అని చెప్పాడు.

అంతే కాదు అయన ఉద్దేశం ప్రకారం అసలు దేనికీ సత్తు (existence ) లేదు. ఒక వేళ ఏదైనా సత్యం ఉన్నా దానిని మనం తెలుసుకోలేము. ఎవరైనా సత్యాన్ని తెలుసుకుంటే కూడా దాన్ని వాళ్ళు ఇంకొరికి దాన్ని బోధించలేరు ఎందుకంటే దానిని భాష వర్ణించలేదు.  

సోఫిస్ట్ లు తమ తత్వాన్ని అతిశయ అంతిమత్వానికి తీసుకెళ్లి వదిలేసారు. కేవలం జ్ఞానం అనేది అసాధ్యం అన్నారు. అంతిమం అయిన నిజం అనేది లేదన్నారు. అసలు సత్యం అనేదే సాపేక్షం అని, నీతి అనేది అసలు లేదు చెప్పారు.

Calicles  అనే సోఫిస్ట్ ప్రకారం న్యాయం అనేది బలహీనుడు ని రక్షించడానికి తయారు చేయబడినట్టిది. అది చాల మంది బలహీనులవల్ల తమను బలవంతుల నుండి రక్షించుకోవడానికి ఏర్పరిచిన ఆచారం.

Thrasymachus  అనే సోఫిస్ట్ Calicles  వాదన ను శీర్షాసనం వేయించాడు. ఈయన ప్రకారం న్యాయం అనేది కొద్దీ మంది బలవంతులు అనేకమంది బలహీనులనుండి తమను రక్షించుకోవడానికి ఏర్పరిచిన ఆచారం.

సోఫిజం లు గ్రీక్ తత్వ విచారంలో ఒక గొప్ప అధ్యాయం. వీరి వాదన మనం ఆమోదించినా లేకపోయినా వారి తత్త్వం వారి తరువాత వచ్చిన గ్రీకు తత్వాన్ని ప్రభావితం చేసింది.

No comments:

Post a Comment

VEERAPPAN-A BRIGAND UNEQUALLED.

  Can one man make a difference to his contemporaries? The history says an emphatic yes. In the contemporary times comes Koose Munisamy Veer...